కలం, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించి సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమె తన రాజకీయ పంథాను పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పటివరకు అందరూ తనను ‘అక్క’ అని పిలిచేవారని, అయితే ఇకపై తనను ‘అమ్మ’ అని పిలవాలని కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. తమిళనాడులో జయలలితను ప్రజలు ఏ విధంగానైతే ‘అమ్మ’ అని ఆరాధించేవారో, అదే తరహాలో తెలంగాణ ప్రజల అవసరాలను ఓ అమ్మలా తీర్చాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మార్పు ఆమెను ఒక మాస్ లీడర్గా నిలబెట్టే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జయలలిత తరహాలోనే సంక్షేమ పథకాలు, ఉద్వేగభరితమైన రాజకీయాలతో ప్రజలకు చేరువ కావాలని కవిత యోచిస్తున్నారు. ఇందులో భాగంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించేలా ఐదు పాయింట్ల అజెండాను ఆమె ప్రకటించారు. పార్టీ జెండాలో కూడా గులాబీ రంగుకు తావు లేకుండా పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులకు ప్రాధాన్యం ఇచ్చింది. బీఆర్ఎస్ (BRS) నీడ నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. తన ప్రసంగం ముగింపులో మద్దతుదారులు ‘అమ్మ సీఎం’ అంటూ నినాదాలు చేయడం కవిత రాజకీయ బ్రాండింగ్లో వచ్చిన స్పష్టమైన మార్పుకు నిదర్శనంగా నిలుస్తోంది.

