కలం వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై హత్యాయత్న జరగడం కలకలం రేపింది. వైట్ హౌస్ సమీపంలోని వాషింగ్టన్ హిల్టన్లో ట్రంప్ ఏర్పాటు చేసిన విలేకరుల విందులో ఈ ఘటన జరిగింది. కరస్పాండెంట్ డిన్నర్ హాల్లో దుండగులు 5 నుంచి 8 రౌండ్లు ఫైరింగ్ చేశారు. దీంతో ఒక్కసారిగా నేతలంతా ఉలిక్కి పడ్డారు. ట్రంప్ సహా కీలక నేతలను భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనతో పూర్తిగా జనంతో నిండిపోయిన బాంక్వెట్ హాల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లను భద్రతా సిబ్బంది వెంటనే బాల్రూమ్ నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు. దుండగుల కాల్పుల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన ఒక పోలీసు అధికారికి గాయాలయ్యాయి.
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతకుముందు ఒక వ్యక్తి తుపాకీతో భద్రతా తనిఖీలను దాటి లోపలికి రావడానికి ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. కాల్పుల సమయంలో అతిథులు టేబుళ్ల కింద దాక్కొని ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. భద్రతా బలగాలు అద్భుతంగా పని చేశాయని ట్రంప్ అభినందించారు. ఒక నిందితుడిని పట్టుకున్నారని వెల్లడించారని, అలాగే కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆయన కోరారు. ప్రస్తుతం వాషింగ్టన్ హిల్టన్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. సాధారణంగా ఈ హోటల్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, కేవలం కార్యక్రమం జరిగే బాల్రూమ్ వద్దే కఠినమైన భద్రతా తనిఖీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి నిందితుడి వివరాలు తెలియాల్సి ఉంది. అమెరికా నిఘా వర్గాలు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాయి.

