కలం, వెబ్ డెస్క్ : తండ్రిగా కేసీఆర్ (KCR) అంటే తనకు అమితమైన గౌరవమని, ఆయన లేకపోతే తనకు జన్మలేదని కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు. శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తన విమర్శలన్నీ కేవలం రాజకీయ కోణంలోనేనని వివరించారు. బీఆర్ఎస్ వ్యవస్థాపకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలపైనే తనకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తొలి ప్రభుత్వం ఏర్పడిన సమయంలోనే ప్రాధాన్యత గల పనులు పూర్తి చేసి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో వైఫల్యం వల్ల రాష్ట్రం భారీగా సంపదను కోల్పోయిందని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో సాగునీరు అందించలేకపోయాయని కవిత (Kavitha) ఆరోపించారు.
ఉద్యోగాల కల్పన విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆమె మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతకు అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలు, గ్రూప్ 1 నిర్వహణలో లోపాల వల్ల రెండు తరాల విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని ఆమె అన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు పరీక్షల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో జరిగిన అవకతవకలు వారి జీవితాలను దెబ్బతీశాయని చెప్పారు. రాజకీయ నాయకుడిగా కేసీఆర్ వైఫల్యాలను ఎత్తిచూపడమే తన ఉద్దేశమని, కుటుంబ సంబంధాలకు దీనితో సంబంధం లేదని ఆమె వివరించారు.

