కలం, వెబ్డెస్క్: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మంత్రి డి.సుధాకర్ (Minister Sudhakar) నేడు అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సుధాకర్ రెండు వారాలుగా బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సుధాకర్ కర్ణాటక అసెంబ్లీలో హిరియూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సుధాకర్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, హిరియూర్ ప్రజలకు తీరని లోటు అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా పేర్కొన్నారు. సుధాకర్ నిరాడంబరంగా ఉండే నాయకుడని చెప్పారు. సామాన్య ప్రజలకు ఎంతో కలివిడిగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్ సహా ప్రముఖ నేతలంతా సుధాకర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

