కలం, వెబ్డెస్క్: పనీర్ పేరుతో మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్న నాన్ డెయిరీ లేదా అనలాగ్ పనీర్ (Analogue Paneer)పై కర్ణాటకలోనూ బ్యాన్ పడింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది రోజుల క్రితమే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఏడాది పాటు బ్యాన్ విధించింది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో కేవలం పాల ద్వారా ఉత్పత్తి అయ్యే పనీర్ను మాత్రమే విక్రయించేలా చూడాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ఆహార భద్రత, ఔషధ నియంత్రణ శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో అనలాగ్ పనీర్ను తయారు చేయడం, ప్యాక్ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం అన్నింటి పైనా ఏడాది పాటు నిషేధం విధించారు. సాధారణంగా పనీర్ను పాల నుంచి తయారు చేస్తారు. కానీ, అనలాగ్ పనీర్ అంటే పాల కొవ్వులకు బదులు పామాయిల్ వంటి చౌకైన వృక్ష సంబంధమైన కొవ్వుల నుంచి తయారు చేస్తారు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా అనలాగ్ పనీర్పై బ్యాన్ ఉంది.

