కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య (Siddaramaiah) సమర్పించిన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అధికారికంగా ఆమోదించారు. ఈ మేరకు రాజ్భవన్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం తన అధికారాలను ఉపయోగించి సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలోని మంత్రివర్గాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే దాకా సిద్ధరామయ్యే తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.

