కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar ) జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం జిల్లా యూనియన్ లిమిటెడ్ నూతన పాలకవర్గం శుక్రవారం తీగలగుట్టపల్లిలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు రాజేందర్ రావును శాలువాతో సత్కరించి, పూల బొకే అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ, గొర్రెల పెంపకం దారుల సంక్షేమం కోసం నూతన పాలకవర్గం సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసి, సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. గొర్రెల పెంపకం దారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం అయ్యేలా పాలకవర్గం చొరవ చూపాలన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గానికి తన పూర్తి సహకారం, ఆశీస్సులు ఉంటాయని రాజేందర్ రావు తెలిపారు. గొర్రెల పెంపకం దారుల అభ్యున్నతికి పాలకవర్గం చేస్తున్న కృషికి అండగా ఉంటానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం జిల్లా యూనియన్ లిమిటెడ్ నూతన చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్, వైస్ చైర్మన్ చిగుర్ల శ్రీనివాస్ కురుమతో పాటు డైరెక్టర్లు అగిత రవీందర్, కాల్వ సురేష్ యాదవ్, చౌటపల్లి రంజిత్ యాదవ్, జిల్లెల్ల పరశురాములు యాదవ్, దాడి ఆంజనేయులు యాదవ్, దాడి సదయ్య యాదవ్, దానే ఒదేలు కురుమ, బండి మల్లయ్య యాదవ్, ముక్కెర సదానందం యాదవ్, సందబోయిన ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు.

