కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో విద్యుత్ తీగల దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ముఠా గుట్టును కరీంనగర్ రూరల్ పోలీసులు (Karimnagar Rural Police) రట్టు చేశారు. నగునూరు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఇద్దరు దొంగలు అడ్డంగా దొరికిపోయారు. పోలీసుల కథనం ప్రకారం… నగునూరు క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపడుతుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న మహమ్మద్ సల్మాన్, ఇమ్రాన్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గత నెలలో చర్ల బూత్కూరు సబ్స్టేషన్లో రాయన్ అనే మరో వ్యక్తితో కలిసి వీరు అల్యూమినియం విద్యుత్ తీగలను దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ చోరీకి వారు ఉపయోగించిన ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

