కలం, కరీంనగర్ బ్యూరో : అనాథ వృద్ధులను ఆదుకుని కరీంనగర్ పోలీసులు (Karimnagar Police) మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామానికి చెందిన శ్రీరామ్ అంజయ్య (75), పెద్దపల్లి జిల్లాకు చెందిన బూర్గు రాజయ్య (80), కరీంనగర్ జిల్లా దేశరాజుపల్లి గ్రామస్తుడైన ఆవుదుర్తి సతీష్ (45) అనే వ్యక్తులను బుధవారం కరీంనగర్ రూరల్ పోలీసులు స్థానిక (విబి ఫౌండేషన్) వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. గ్రామాల్లో అనాథలుగా ఉండి తిండి లేక ఆరోగ్యం క్షీణించిందని గ్రామస్తులు కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించారు.
ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించి వారి బాగోగుల చూసుకునేందుకు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ (Karimnagar Police Station) పరిధిలోని వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్దుల ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ కు అప్పగించారు. వారికి అవసరమైన మందులు, పండ్లు అందించి వాహనంలో ఆశ్రమంలో చేర్పించారు. ఎవరైనా అనాథలుంటే కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సైలు నరేష్, లక్ష్మారెడ్డిలు సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా రెడ్ క్రాస్ సెక్రటరీ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి పాల్గొని అనాథలను ఆదుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులను కొనియాడారు.
Read Also: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం ప్రకటన
Follow Us On: Sharechat

