కలం, కరీంనగర్ బ్యూరో: రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Karimnagar Mayor Kolagani Srinivas) తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి, రోడ్లపైకి వర్షపు నీరు చేరకుండా ఉండేందుకు అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. డ్రైనేజీల పూడికతీత పనులను పరిశీలించిన సందర్భంగా సిల్ట్ కంటే భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయని మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు.
నగరంలో ఇంటింటికీ ‘స్వచ్ఛ ఆటోల’ ద్వారా చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ, కొందరు నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ కవర్లు, చెత్తను డ్రైనేజీల్లో వేయడం వల్ల మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హానికరమని చెప్పారు. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా ఇది ఒక కారణంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. అందువల్ల నగర ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, “ప్లాస్టిక్ రహిత కరీంనగర్” లక్ష్య సాధనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
చెత్త సేకరణలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే స్థానిక కార్పొరేటర్ల దృష్టికి తీసుకువస్తే వెంటనే స్వచ్ఛ ఆటోలను పంపించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. నగర పరిశుభ్రతను కాపాడేందుకు రోడ్లపై, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు లేదా ఇతర చెత్తను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని నగర ప్రజలకు మేయర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు స్థానిక కార్పొరేటర్ బండారి వేణు, మాజీ కార్పొరేటర్ జితేందర్, సాదవేని శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: అలర్ట్.. ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్కు చిట్ట చివరి స్థానం!
Follow Us On: Instagram

