కలం, కరీంనగర్: ప్రస్తుత కాలంలో విద్యార్థులకు క్రీడల ద్వారా ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్ పద్మనగర్లోని మానేరు సీబీఎస్ఈ పాఠశాలలో(Manair CBSE School) జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో, మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో నిర్వహిస్తున్న 70వ ఎస్జీఎఫ్ అర్బన్ కబడ్డీ క్రీడోత్సవాలను (Kabaddi Tournament) మేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు ఒలింపిక్, ఎస్జీఎఫ్ క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన మార్చ్పాస్ట్ను అతిథులు తిలకించి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ స్థాయి పోటీలకు భారత్ను సిద్ధం చేస్తోందని తెలిపారు. మానేరు విద్యాసంస్థలు ఏటా ఎస్జీఎఫ్ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ క్రీడ అయిన కబడ్డీలో విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. క్రీడలతో విద్యార్థులకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో మేయర్ వ్యాయామ కసరత్తు నిర్వహించారు.
వరుసగా రెండేళ్లు పోటీల నిర్వహణ
మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ.. ఎస్జీఎఫ్ కబడ్డీ పోటీలను వరుసగా రెండో ఏడాది కూడా నిర్వహించే అవకాశం మానేరు విద్యాసంస్థలకు దక్కడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలకు కేరాఫ్ అడ్రస్గా మానేరు విద్యాసంస్థలు నిలుస్తున్నాయని అన్నారు. ఎస్జీఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాను ముందంజలో నిలపాలని విద్యార్థులకు సూచించారు.
55 పాఠశాలల నుంచి 1,400 మంది క్రీడాకారులు
ఎస్జీఎఫ్ అర్బన్ కార్యదర్శి అంతటి శంకరయ్య మాట్లాడుతూ.. కబడ్డీ పోటీల్లో సుమారు 55 పాఠశాలలకు చెందిన 1,400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. మంగళవారం అండర్-14, అండర్-17 బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, జిల్లా పాఠశాలల, కళాశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి బన్సీలాల్, జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి మల్లేశ్గౌడ్, మాజీ ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, పీపీఈటీ బాధ్యులు దారం గౌతంరెడ్డి, కంకటి అనూప్కుమార్, పీడీలు, పీఈటీలు సిలివేరి మహేందర్, శ్రీధర్రెడ్డి, లింగారావు, అనిల్, అజయ్, వినయ్, మణి, స్వామి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మానేరు విద్యాసంస్థల విద్యార్థులు చేసిన సాంసృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.

