కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వేల కిలోమీటర్ల మేర కొనసాగుతున్న “రాగా ఫర్ ఇండియా ” (Raaga for India Padayatra) జాతీయ పాదయాత్రకు మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా కాంగ్రెస్ కుటుంబం తరఫున హృదయపూర్వక స్వాగతం, అభినందనలుతో పాటు సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు (DCC President) సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) తెలిపారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత, ప్రజా నాయకులు రాహుల్ గాంధీని భారత ప్రధానిగా చూడాలనే దృఢ సంకల్పంతో, ఆయన ఆలోచనలు, ఆశయాలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన ఈ సుదీర్ఘ పాదయాత్ర అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఎండ, వాన, అలసట, శారీరక శ్రమను ఏమాత్రం లెక్కచేయకుండా దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వేల కిలోమీటర్లు నడుస్తున్న వెంకటేశ్వర్లు సంకల్పం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచనా విధానమే మార్గదర్శకం
దేశంలో న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ గారు నిరంతరం పోరాడుతున్నారని సంజీవ్ ముదిరాజ్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, సామాన్య ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాలను అర్థం చేసుకునే నాయకుడిగా రాహుల్ గాంధీ దేశ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించారని అన్నారు.
రాగా ఫర్ ఇండియా – బలమైన భారతదేశం కోసం అడుగులు..
“రాగా ఫర్ ఇండియా” పాదయాత్ర కేవలం ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా చూడాలనే ఆకాంక్ష మాత్రమే కాదని, ఐక్యమైన, సమ్మిళితమైన, న్యాయబద్ధమైన, బలమైన, ప్రగతిశీల భారతదేశ నిర్మాణం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత రాజకీయాలకు దూరంగా కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణలో చురుకైన భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ ప్రగతిశీల ఆలోచనలు, సామాజిక న్యాయం, సమానత్వం వంటి సందేశాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని కోరారు. పాలమూరు–మహబూబ్నగర్ గడ్డపైకి “రాగా ఫర్ ఇండియా పాదయాత్ర రావడం గర్వకారణమని, వెంకటేశ్వర్లు కి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన స్వాగతం పలుకుతున్నామని సంజీవ్ ముదిరాజ్ తెలిపారు.
వెంకటేశ్వర్లు వేసే ప్రతి అడుగు ప్రజాస్వామ్య పరిరక్షణకు, సామాజిక న్యాయానికి, సమానత్వానికి, రాహుల్ గాంధీ నాయకత్వంలో బలమైన భారతదేశ నిర్మాణానికి వేసే అడుగు అని పేర్కొన్నారు. ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని, దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు లభించాలని ఆకాంక్షిస్తూ మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షులు ఎ. సంజీవ్ ముదిరాజ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, మినాజుద్దీన్, టీపీసీసీ అధికార ప్రతినిధి జాహీర్ అక్తర్, కార్పొరేటర్లు ఎంపీ ప్రవీణ్ కుమార్, అవేజ్, తాహెర్, ప్రశాంత్, మేఘ్య నాయక్, జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ పసుల రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, హన్వాడ మండల అధ్యక్షులు మహేందర్ , ఎన్ఎస్యూఐ నాయకులు నరేష్ యాదవ్, నందు యాదవ్, ఇమాద్, రోహిత్, నవీన్, కెవిన్, రమణ, యూత్ కాంగ్రెస్ నాయకులు రఫీక్, సంధ్య, ముస్తాక్ అలీ, సేవాదళ్ నాయకులు జగదీష్, సలాం బిన్, ఎం.డి. వెంకట్ లక్ష్మి, అలీ, కాంగ్రెస్ నాయకులు గోపాల్ యాదవ్, బసీద్, అక్బర్, బురెమోని చందు యాదవ్, నసీర్, నహీమ్, నూర్ హసన్, ఖాజా నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

