కలం, కరీంనగర్ బ్యూరో: నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా కరీంనగర్ (Karimnagar) బస్టాండ్ ఇన్ గేట్ (In-Gate) వద్ద శనివారం నాడు నూతన ట్రాఫిక్ ఔట్ పోస్ట్ బూత్ను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో అత్యంత రద్దీగా ఉండే బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలను అదుపు చేయడానికి, నిరంతరం పర్యవేక్షించడానికి ఈ నూతన ఔట్ పోస్ట్ బూత్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలని సూచించారు.
సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ – కూలింగ్ గ్లాసెస్ పంపిణీ
కార్యక్రమంలో భాగంగా, భానుడి భగభగలకు సైతం వెరవకుండా రోడ్లపై నిలబడి విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేక కూలింగ్ గ్లాసెస్ (కళ్ళద్దాలను) సీపీ అందజేశారు. తీవ్రమైన ఎండల నుండి సిబ్బంది తమ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. విధి నిర్వహణతో పాటు సిబ్బంది ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఈ సందర్భంగా సీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామితో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, సబ్-ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

