కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఇప్పటివరకు 80 శాతం మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. మరో వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాల ద్వారా 560 మంది రైతుల నుంచి 2.10 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరో లక్ష క్వింటాళ్ల వరకు మొక్కజొన్న కొనుగోళ్లకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలో గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మార్క్ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి రోజు 15 వేల క్వింటాళ్ల మొక్క జొన్న కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
రైతులకు ఆందోళన వద్దు..
కరీంనగర్ మార్కెట్ యార్డులో ఇప్పటి వరకు 18 వేల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే 36 వేల బ్యాగులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను గోదాముల్లో భద్రపరుస్తూ, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తగినంత స్టోరేజ్ అందుబాటులో ఉందని.. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చేయవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.

