కలం, స్పోర్ట్స్ : రాబోయే 2026 జపాన్ ఆసియా గేమ్స్లో భారత యువ గోల్ఫర్లు అద్భుతంగా రాణిస్తారని పీజీటీఐ ప్రెసిడెంట్ కపిల్ దేవ్ (Kapil Dev) ధీమా వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే మన అథ్లెట్లకు తమ సంస్థ తరఫున పూర్తి మద్దతు ఇస్తామని సోమవారం ఆయన ప్రకటించారు. భారత గోల్ఫ్ యూనియన్ (ఐజీయూ) ఇప్పటికే ఆరుగురు సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. మహిళల జట్టులో ఒలింపియన్లు అదితి అశోక్, దీక్షా దాగర్తో పాటు ప్రణవి ఉర్స్ ఉన్నారు.
గత ఆసియా గేమ్స్లో అదితి రజత పతకం సాధించారు. పురుషుల జట్టుకు యువరాజ్ సంధు నేతృత్వం వహిస్తుండగా, వీర్ అహ్లావత్, సప్తక్ తల్వార్ ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో సీనియర్లకు, యువ ఆటగాళ్లకు మధ్య పెద్దగా తేడా లేదన్నారు. యువకులు నిలకడగా రాణిస్తున్నారని, టోర్నమెంట్ సమయంలో ఒత్తిడిని జయించి ఆడాలని ఆకాంక్షించారు. తాను వ్యక్తిగతంగా జపాన్ వెళ్లడం లేదని, కానీ ఆటగాళ్లకు అవసరమైన సహాయం అందించడానికి పీజీటీఐ ప్రతినిధులు అక్కడికి వెళ్తారని చెప్పారు.
అంతర్జాతీయ వేదికలపై విజయం సాధించాలంటే కష్టపడటం, మనసును కేంద్రీకరించడమే ముఖ్యమని సూచించారు. ఆసియా గేమ్స్ గోల్ఫ్ చరిత్రలో భారత్కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పటివరకు దేశం మూడు స్వర్ణాలు, మూడు రజత పతకాలను గెలుచుకుంది. 1982లో లక్ష్మణ్ సింగ్ బృందం, 2002లో శివ్ కపూర్ స్వర్ణాలు సాధించారు. అలాగే 2006, 2010 లలో భారత జట్లు రజత పతకాలను కైవసం చేసుకున్నాయి. ఈసారి కూడా భారత ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

