కలం, వెబ్ డెస్క్: నారాయణపేట (Narayanpet) జిల్లా మక్తల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొందరు వ్యక్తులు తమ స్నేహితుడిని చంపేశారు. అంతే కాకుండా అతడు ప్రమాదవశాత్తు మరణించాడని అందరూ నమ్మేలా చేశారు. చివరకు పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్కు చెందిన ఓ వ్యక్తిని అతడి స్నేహితులు మద్యం తాగేందుకు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ సదరు వ్యక్తి అతిగా మద్యం సేవించి నిద్రలోకి జారుకున్న తర్వాత అతడిని కర్రలు, రాయితో కొట్టి చంపేశారు.
ఆ తర్వాత ప్రమాదవశాత్తు మరణించినట్లు కుటుంబసభ్యులను నమ్మించారు. కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా స్నేహితులు చేసిన దారుణం బయటపడింది. సదరు వ్యక్తి పేరు మీద ఉన్న రూ.50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కారు, రాయి, కట్టెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

