కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగు దనం లేదని, రాష్ట్రం పేరును తెలుగునాడుగా మార్చాలన్న గరికపాటి నరసింహారావు (Garikapati Narasimha Rao) వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గరికపాటి వ్యాఖ్యలకు భూవనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి (Kamalananda Bharati) కౌంటర్ ఇచ్చారు. అడిగే వాళ్లు లేరని గరికపాటి అధిక ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? అని ప్రశ్నించారు. రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉందని వెల్లడించారు.
గరికపాటి ఎక్కడో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఆయన తెలంగాణలో సెటిల్ అయ్యారని, ఆంధ్రకు రారని అన్నారు. ‘మా ప్రాంతం, మా బతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు. వింత పోకడలు, వింత ఆలోచనలు మంచివి కావన్నారు. రాష్ట్రం పేరు తెలుగునాడు అని మార్చినా సెంటిమెంట్ ఏమీ రాదని, ఇలాంటి మేధావులే ఏపీకి మద్రాస్ రాకుండా చేశారని కమలానంద భారతి పేర్కొన్నారు.

