కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడబిడ్డల భక్తికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు (Ashada Bonalu) నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. భాగ్యనగర వైభవాన్ని చాటిచెప్పే ఈ ఉత్సవాలకు చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయం వేదిక కానుంది. ఈ రోజు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరఫున అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించడంతో ఈ నెల రోజుల సంబరాలకు అధికారికంగా అంకురార్పణ జరగనుంది. పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపులు, శివసత్తుల పూనకాలతో నగరంలోని ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి.
ఈ ఏడాది ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని సుమారు మూడు వేలకు పైగా ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వేడుకలను ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.20 కోట్ల నిధులను కేటాయించింది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరం మొత్తం అమ్మవారి స్మరణతో, సంప్రదాయ కోలాహలంతో కళకళలాడనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ బోనాల (Ashada Bonalu) పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

