కలం, వెబ్ డెస్క్ : పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు, ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్లమెంటులో తెలంగాణ ప్రాతినిధ్యం 3.13 శాతంగా ఉందని, డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత కూడా ఈ శాతాన్ని కనీస ప్రాతిపదికగా కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 50 శాతం సీట్ల పెరుగుదల పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణకు జరిగే అన్యాయం స్పష్టంగా కనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం ప్రస్తుతం ఉన్న 3.13 శాతం కంటే తగ్గితే, రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతారని కవిత హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం అత్యంత దురదృష్టకరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును డీలిమిటేషన్తో కాకుండా, బీసీ (OBC) రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టి ఆమోదించాల్సిన అవసరం ఉందని ఆమె కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

