కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో కవిత (Kalvakuntla Kavitha) నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు నిరసనగా ఈ దీక్ష చేపట్టినట్లు ఆమె తెలిపారు. సోమవారం రాత్రి ఖమ్మంలో దీక్ష ప్రారంభించిన కవితను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలోనే ఆమె తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్లలో కూల్చివేసిన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ హామీ వచ్చే వరకు తన నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. భూదాన్ భూములను ఆక్రమించుకునే హక్కు ప్రభుత్వానికి లేదని ఆమె ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే పేదల భూములను కబ్జా చేస్తోందని ఆరోపించారు.
వెలుగుమట్లలో భూముల ధరలు పెరగడంతో పేదల ఇళ్లు కూల్చి ఆ భూమిని పెద్దలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని కవిత విమర్శించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెలుగుమట్ల (Velugumatla) వ్యవహారంలో వాస్తవాలు తెలుసుకొని స్పందించాలని ఆయనను కోరారు. వెలుగుమట్లలో సుమారు 30 ఎకరాల భూదాన్ భూమి, మరో 30 ఎకరాల ఆక్రమణకు గురైన భూమి ఉందని తెలిపారు. మొత్తంగా 62 ఎకరాల భూమిలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారని చెప్పారు. అయితే అధికారులు అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్లతో సుమారు 750 ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు.
టెన్త్, ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థుల హాల్ టికెట్లు ఉన్న ఇళ్లను కూడా కూల్చివేయడంతో వారు పరీక్షలు ఎలా రాయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని కవిత అన్నారు. ప్రస్తుతం బాధితులను అంబేద్కర్ భవన్లో ఉంచారని, అక్కడ పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. కనీసం భోజనం కూడా ఇవ్వకపోవడంతో బాధితులు దాతల సహాయంపై ఆధారపడుతున్నారని చెప్పారు. బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, తెలంగాణ జాగృతి, ధర్మసమాజ్ పార్టీ నేతలు కలిసి ఖమ్మంలో నిరసన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.పేదల ఇళ్లు కూల్చిన ప్రభుత్వం సమాధానం చెప్పాలని కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు.
Read Also: గాంధీ విగ్రహం ఏర్పాటుపై అపోహలు తొలగించాలి : తుషార్ గాంధీ
Follow Us On: Pinterest

