కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన నూతన రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం అట్టహాసంగా ముస్తాబైంది.
ఈ నూతన ప్రస్థానాన్ని ప్రారంభించే ముందు కవిత తన నివాసంలో భర్త అనిల్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం ఆమె గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, అక్కడి నుండి నేరుగా బహిరంగ సభా ప్రాంగణానికి బయలుదేరారు. ఉదయం 10 గంటలకు పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడంతో పాటు పార్టీ జెండాను కూడా ఆమె ఆవిష్కరించనున్నారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి సుమారు 50 వేల మంది కార్యకర్తలు ఈ సభకు తరలిరానున్నారు. ఈ భారీ బహిరంగ సభకు వచ్చే అతిథుల కోసం, కార్యకర్తల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా 34 రకాల వంటకాలతో విందు భోజనాలను సిద్ధం చేశారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రతి వర్గానికి సమాన న్యాయం అందించడమే ఈ పార్టీ ప్రధాన ఉద్దేశమని కవిత కార్యాలయం స్పష్టం చేసింది. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న కవిత అడుగులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

