కలం, నిజామాబాద్ బ్యూరో: బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ప్రశాంత్ రెడ్డి మహా భారతంలో శకుని లాంటి వాడు. తండ్రీ కుమార్తెలను విడదీసిన పాపాత్ముడు. ఆయనకు ఇక ప్రజా జీవితం లేదు. ఎమ్మెల్యేలతో కలిసి నన్ను అణగదొక్కేందుకు ప్రయత్నించారు. ప్రశాంత్ రెడ్డికి బాల్కొండలో పెద్ద క్వారీ, గంజాయి దందా ఉంది. ఆయన కారణంగా అక్కడ ఒక డ్యాం కొట్టుకుపోయింది. అయినా కాంగ్రెస్ నాయకులు స్పందించరు. మరి, వాళ్లతో ఏం అవగాహన ఉందో’ అని సంచలన ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో అయిదు నియోజకవర్గాలు గెలుస్తామని ధీమా వ్యక్తం ఏశారు.
షాడో ఎమ్మెల్యేలను నియమిస్తాం..
నిజామాబాద్ జిల్లాలో రాబోయే రోజుల్లో షాడో ఎమ్మెల్యేలను నియమించి, ప్రస్తుతం ఎమ్మెల్యేల వెంట పడుతామని కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో భూపతి రెడ్డి చేస్తున్న ఇటుక దందాలు బయటకు తెస్తామన్నారు. అర్బన్ నియోజకవర్గంలో ధన్ పాల్ సూర్యనారాయణ కడుతున్న అక్రమ కాంప్లెక్స్ భవనాల వెంబడి పడుతామన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి బయల్దేరిన సమయంలో సిద్ధిపేట ప్రజలు ఎలాగైతే ఆశీర్వదించారో.. బహుజన తెలంగాణ కోసం బయల్దేరుతున్న తనకు నిజామాబాద్ జిల్లా ప్రజలు అలాగే ఆశీర్వదించాలని కోరారు.

