కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో మైనర్లకు మందు సరఫరా చేస్తున్న పబ్ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు (Jubilee Hills Police) కేసు నమోదు చేశారు. లఫ్ట్ పబ్లో పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఆరుగురు మైనర్లకు లిక్కర్ అందించినట్లు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మొదట వయస్సు చెప్పేందుకు నిరాకరించగా.. ఆధార్ కార్డులు చెక్ చేయగా మైనర్లుగా తేలింది. వీరంతా నగరంలో వివిధ కోచింగ్ సెంటర్లలో సీఏ, జేఈఈ కోచింగ్ తీసుకుంటున్నట్లుగా తేలింది. పబ్ నిర్వాహకులను ప్రశ్నించిన పోలీసులు, లైసెన్స్ రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సిఫార్సు చేశారు. పోలీసులు రావడంతో కొందరు పారిపోయేందుకు ప్రయత్నించారు.
అమలు కాని నిబంధనలు..
నిబంధనల ప్రకారం పబ్ల్లోకి మైనర్లను అనుమతించరాదు. ఎంటర్ అయ్యే ప్రతి వ్యక్తి వయస్సు నిర్ధారణ చేసుకున్నాకే ప్రవేశం ఉంటుంది. అయితే నగరంలోని చాలా పబ్ల్లో ఇలాంటి రూల్స్ అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనర్లను అనుమతించడమే కాకుండా, డ్రగ్స్ వంటివి కూడా అందిస్తున్న ఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ప్రతి పబ్లోని సీసీ టీవీ కెమెరాలను ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలనే ప్రతిపాదన కూడా అటకెక్కింది.

