కలం, వెబ్ డెస్క్ : నగలు కొంటామని వచ్చిన ముగ్గురు మహిళలు వ్యాపారి కళ్లుగప్పి భారీ చోరికి పాల్పడ్డారు. గుజరాత్ (Gujarat) లోని మెహసానా జిల్లాలోని విశ్నగర్లోని ఓ నగల దుకాణంలోకి ముగ్గురు గుర్తుతెలియని మహిళలు వచ్చారు. నగలు చూపెట్టాలని వ్యాపారిని వారు ఏమార్చారు. ఇద్దరు మహిళలు వ్యాపారిని మాటల్లో పెట్టగా మూడో మహిళ తన పని కానిచ్చేసింది.
షాపులోని నగలు, నగదు ఉన్న బ్యాగును మెల్లిగా తీసుకుని ముగ్గురు పరారయ్యారు. ఈ ఘటనలో రూ.2.50 లక్షల నగదుతో పాటు రూ.7.02 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు అపహరణకు గురయింది. మొత్తం రూ.9.52 లక్షల విలువైన సొత్తు చోరీ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

