కలం, వెబ్ డెస్క్: భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ఒక్కసారిగా పాత గాయాలను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. 2025 హోమ్ వరల్డ్ కప్ గెలిచినా.. ఆ టోర్నీలో తాను అనుభవించిన నరకం అంతా ఇంతా కాదంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసలు విషయాలు బయటపెట్టారు. సొంత దేశంలో మ్యాచ్లు అనగానే విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయిందని, అందుకే మొదటి మ్యాచ్లోనే ఫస్ట్ బాల్కే డకౌట్ అయ్యానని చెప్పారు. దాంతో మైండ్లో ఏదో తెలియని భయం మొదలై, తన ప్రాణమైన ఫీల్డింగ్లో కూడా తప్పులు చేశానని జెమిమా ఆవేదన చెందారు.
ఆ తర్వాత ఆస్ట్రేలియాపై 33 రన్స్ కొట్టి కొద్దిగా ఫామ్లోకి వచ్చారు. ఇక ఇంగ్లాండ్తో జరిగే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ కోసం తెగ ప్రిపేర్ అయ్యారు. తీరా మ్యాచ్ రోజు పొద్దునే కోచ్ అమోల్ సర్ పిలిచి, ఈ మ్యాచ్లో నిన్ను టీమ్ నుండి డ్రాప్ చేస్తున్నాం అని చెప్పడంతో లోపల పూర్తిగా విరిగిపోయానని చెప్పారు. ఆ బాధతో వరల్డ్ కప్లో దాదాపు ప్రతిరోజు ఏడ్చేదాన్నని జెమిమా కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాతే అసలైన ట్విస్ట్ వచ్చింది.
ఇంగ్లాండ్ మ్యాచ్కి దూరమైనా పట్టుదల వదలని జెమిమా.. ఆస్ట్రేలియాతో జరిగిన చావో రేవో లాంటి సెమీఫైనల్లో ఊహించని రేంజ్లో చెలరేగిపోయారు. ఏకంగా 127 రన్స్తో అజేయ సెంచరీ కొట్టి, వరల్డ్ కప్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రన్ చేజ్ చేసి ఇండియాను ఫైనల్ చేర్చారు. ఆ తర్వాత సౌతాఫ్రికాను ఓడించి భారత్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. డ్రాప్ చేసినా సరే, టోర్నీ మొత్తం మీద 58.40 యావరేజ్తో 292 రన్స్ కొట్టి జెమిమా తన పవర్ ఏంటో చూపించారు.

