కలం, వెబ్ డెస్క్: రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని.. కేసీఆర్ సీఎం కాబోతున్నారని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో శనివారం ప్రెస్మీట్ నిర్వహించి మాట్లాడారు. ‘రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ ఇది ప్రజల్లో వస్తున్న డిమాండ్ అని.. దీన్ని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. విద్యార్థుల కోసం ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాకా ఈ పథకాన్ని కేసీఆర్ (KCR) ప్రభుత్వం మరింత పటిష్టంగా అమలు చేసిందని చెప్పారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య పూర్తి అయినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో సర్టిఫికేట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. చివరికి కళాశాల యాజమాన్యం కోర్టుకు వెళ్ళాయని.. బకాయిలు వసూలు కోసం యాజమాన్యాలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. దీంతో డైరెక్ట్గా విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ చేస్తాం అంటూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని చెప్పారు. గతంలో వలె ఫీజ్ రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) అమలు చేయాలని.. రూ. 10 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి.. ఎందుకంత కక్ష?
రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఎందుకు నీకు నిరుపేద వర్గాలు అంటే కక్ష అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ నిబంధనలు పాటించడం నీ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. విద్యా, వైద్యం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు అని.. వైద్యానికి సంబంధించి కూడా ఆరోగ్య శ్రీ పథకాన్ని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం మరింత పటిష్టం చేయాలని చూసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 33 జిల్లాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో వైద్య విద్యా కాలేజ్లను కేసీఆర్ ఏర్పాటు చేశారని కొనియాడారు. వైద్య విద్యా కాలేజ్లతో పాటు సూపర్ స్పెషాలిటీ కళాశాలలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారని.. అవి అన్ని కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. గత పాలన కంటే మెరుగైన పాలన కొనసాగించాలి.. కాని రేవంత్ రెడ్డికి అది సాధ్యం కాదని దుయ్యబట్టారు.

