కలం, వరంగల్ : వరంగల్ (Warangal) జిల్లా నర్సంపేట మండలంలోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాల (Jayamukhi Engineering College) వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యం సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో తమ విద్యా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై యాజమాన్యం నుంచి స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు.
పరీక్షలు ఆలస్యం కావడం వల్ల ఉన్నత విద్య అవకాశాలు, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు స్పష్టమైన తేదీ ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో కళాశాల వద్ద పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.

