కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్ టెస్టు జట్టు మాజీ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం జేసన్ గిలెస్పీ(Jason Gillespie) పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board )పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తనకు రావాల్సిన వేల డాలర్ల పరిహారాన్ని బోర్డు ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపించారు. తాను ఎప్పుడూ తన సూత్రాలకు కట్టుబడి ఉంటానని, జీతం కోసం బోర్డు చెప్పిన ప్రతిదానికీ తల ఊపే వ్యక్తిని కాదని గిలెస్పీ స్పష్టం చేశారు. చీఫ్ సెలెక్టర్ మోహ్సిన్ నఖ్వీ ఆధ్వర్యంలో ఆకీబ్ జావేద్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే పాకిస్థాన్ క్రికెట్లో పరిస్థితులు దిగజారడం ప్రారంభమయ్యాయని ఆయన ఆరోపించారు.
ఆకీబ్ జావేద్ రాకతో కోచ్గా తనకున్న అధికారాలను ఒక్కొక్కటిగా కోల్పోయానని గిలెస్పీ పేర్కొన్నారు. జట్టు నిర్వహణ, ఆటగాళ్ల ఎంపిక వంటి కీలక విషయాల్లో తనను పూర్తిగా పక్కనబెట్టి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చేదు అనుభవం కారణంగా తనపై తనకే అనుమానం కలిగిందని, చివరకు కోచింగ్ చేయడంపైనే అసహనం ఏర్పడిందని గిలెస్పీ తెలిపారు. ఆకీబ్ జావేద్ తన వెనుక ఉండి కుట్రలు చేశారని ఆరోపించారు. తనపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం కొనసాగిస్తే ఆకీబ్ జావేద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గిలెస్పీ హెచ్చరించారు. పీసీబీ మద్దతు ఉండటంతోనే ఆకీబ్ జావేద్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆకీబ్ జావేద్ పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థలో కొనసాగినంతకాలం పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని గిలెస్పీ అభిప్రాయపడ్డారు. జట్టుకు సరైన కోచ్ను నియమించి, అతనికి పూర్తి అధికారాలు అప్పగించినప్పుడే పాకిస్థాన్ క్రికెట్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.

