వనపర్తిలో అనధికార మీ సేవ కేంద్రాలపై తనిఖీలు

కలం, వనపర్తి: ప్రభుత్వం కేటాయించిన నిర్దేశిత ప్రదేశాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో అనధికారికంగా మీ సేవ (MeeSeva), ఓఎస్ఎస్ (OSS) ప్రభుత్వ సేవలు నిర్వహిస్తున్న ఇంటర్నెట్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని  జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) హెచ్చరించారు. ఈ అంశంపై వార్తాపత్రికలో ప్రచురితమైన కథనాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు తనిఖీలు చేపట్టారు. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు వనపర్తి (Wanaparthy) ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ (EDM), ఎంఆర్ఐ అధికారులు జిల్లాలోని పలు ఇంటర్నెట్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వం కేటాయించిన ప్రదేశాల్లో కాకుండా ఇతర ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా అనధికారికంగా మీ సేవ ప్రభుత్వ సేవలు అందిస్తున్న కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రాజపేట గ్రామం, వనపర్తి పట్టణంతో పాటు ఆత్మకూర్ మండలం రెచింతల గ్రామానికి కేటాయించిన ఓఎస్ఎస్ ఐడీలతో కూడిన కేంద్రాలు కూడా నిర్దేశిత ప్రదేశాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లోని ఇంటర్నెట్ సెంటర్లలో నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన మీ సేవ, ఓఎస్ఎస్ కేంద్రాలను ముందస్తు అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం, అనధికార వ్యక్తులతో నిర్వహించడం లేదా ఇతర ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా ప్రభుత్వ సేవలను అందించడం ఏమాత్రం అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించిన కేంద్రాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా మీ సేవ, ఓఎస్ఎస్, ఇతర ప్రభుత్వ సేవలు నిర్వహిస్తున్న కేంద్రాలను గుర్తించేందుకు తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలోని అన్ని మీ సేవ, ఓఎస్ఎస్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం కేటాయించిన నిర్దేశిత ప్రదేశాల్లోనే సేవలు అందించాలని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అనధికార వ్యక్తులు, అనధికారిక ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా ప్రభుత్వ సేవలు పొందే ప్రయత్నంలో ప్రజలు మోసపోయి ఆర్థికంగా నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ సేవల కోసం అధికారికంగా కేటాయించిన మీ సేవ, ఓఎస్ఎస్ కేంద్రాలను మాత్రమే సంప్రదించాలని కోరారు. అనధికారికంగా ప్రభుత్వ సేవలు నిర్వహిస్తున్న కేంద్రాలు లేదా వ్యక్తులపై సమాచారం ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను అధికారులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>