కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ (Jani Master vs Sekhar Master) వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్లో నిబంధనలకు విరుద్ధంగా బైఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నించడమే ఈ వివాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
అసోసియేషన్లో ఎన్నికలు, సభ్యత్వాల కేటాయింపు వంటి కీలక అంశాలపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫెడరేషన్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే ఈ ఉప ఎన్నికల ప్రక్రియకు సిద్ధం కావడంతో, అసోసియేషన్ సమావేశం కాస్తా ఉద్రిక్తతకు దారితీసింది.
అసోసియేషన్ తీరుకు నిరసనగా దాదాపు పది మంది డ్యాన్సర్లు తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఫిలింనగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇరు వర్గాలు పరస్పరం అభ్యంతరాలు వ్యక్తం చేసుకుంటూ వెనక్కి తగ్గకపోవడంతో అసోసియేషన్లో మునుపెన్నడూ లేని విధంగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ఈ వివాదాన్ని సర్దుమణిగేలా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగినట్లు సమాచారం. గొడవ పెద్దదవుతున్న తరుణంలో ఇరు వర్గాల (Jani Master vs Sekhar Master) డాన్స్ మాస్టర్లు మెగాస్టార్ నివాసానికి వెళ్లినట్లు వినిపిస్తోంది. పరిశ్రమలో ఎలాంటి సమస్య వచ్చినా పెద్దరికం వహించే చిరంజీవి, ఈ వివాదానికి కూడా ఫుల్స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించారని టాక్ నడుస్తోంది. అయితే చిరు ఈ వివాదాన్ని పూర్తిగా సెటిల్ చేశారా లేదా అనే విషయాలపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కొరియోగ్రాఫర్ల ఫైట్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
Read Also: పాలిటిక్స్లోకి ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన టీం
Follow Us On: Instagram

