కలం, మహబూబ్ నగర్ బ్యూరో : సహజసిద్ధమైన మట్టి విగ్రహాలే పర్యావరణ హితానికి దోహదం చేస్తాయని మహబూబ్ నగర్ (Mahabubnagar) డిసిసిబి అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని చైతన్య పాఠశాలలో “గో గ్రీన్ గణేష్” ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సహజ మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి ప్రకృతిని పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇది కొత్త కార్యక్రమం కాదని, గత పది సంవత్సరాలుగా తాను నిరంతరంగా నిర్వహిస్తున్న పర్యావరణ ఉద్యమమని తెలిపారు. ప్రతి ఏడాది పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు ప్రాంగణాలు, కాలనీలలో సహజ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తూ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కేవలం మట్టి విగ్రహాల పంపిణీ మాత్రమే సరిపోదని, పిల్లల్లో అవగాహన పెంపొందించడం ద్వారానే శాశ్వత మార్పు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
P.O.P. విగ్రహాల వల్ల చెరువులు, నదులు, జలచరాలు, పర్యావరణానికి కలిగే హానిని చిన్నారులకు వివరించడం అత్యంత అవసరమని తెలిపారు. “పిల్లలే మార్పుకు రాయబారులు. వారిని చైతన్యవంతులను చేస్తే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, హరితమైన సమాజాన్ని అందించగలం” అని సంజీవ్ ముదిరాజ్ చెప్పారు.
ఈ 60 రోజుల ప్రచార కార్యక్రమం మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, ప్రజా ప్రదేశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. P.O.P. విగ్రహాలకు బదులుగా సహజ మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఉపయోగిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీధర్, ఏజీఎం భాస్కర్ రెడ్డి, ప్రభాకర్, చందు యాదవ్,రాకేష్ శెట్టి, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

