కలం, జనగామ : ఆరోగ్యకరమైన తల్లి ఒక ఆరోగ్యకరమైన కుటుంబానికి, బలమైన సమాజ నిర్మాణానికి పునాది అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Collector Sandeep Kumar Jha) పేర్కొన్నారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (Praja Palana – Pragati Pranalika) కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో ‘జిల్లా స్థాయి సురక్షిత మాతృత్వ దినోత్సవం'(Safe Motherhood Day) వర్క్షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, తల్లి ఆరోగ్యం కేవలం గణాంకం కాదని, అది ప్రజారోగ్య వ్యవస్థ పనితీరుకు ప్రతిబింబమని అన్నారు. గత రెండు దశాబ్దాలుగా మాతా-శిశు మరణాల తగ్గింపులో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, ఇంకా క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది గర్భిణీ స్త్రీలపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు. హైరిస్క్ గర్భిణీలను ప్రారంభ దశలోనే గుర్తించి, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, డీసీహెచ్ఎస్ నరేందర్ శర్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, డీడబ్ల్యూఓ కోదండరాములు, గైనకాలజిస్టులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: కంటి ఇన్ఫెక్షన్లకు ఇక మందులు కూడా పనిచేయవా?
Follow Us On: Sharechat

