కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా జనగామ బస్టాండ్ పరిసర ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో 2.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ రతీష్తో పాటు కానిస్టేబుళ్లు సాగర్, రమేష్, నరేష్, ప్రణయ్, మహేందర్లు ఆదివారం బస్టాండ్ పరిసర ప్రాంతంలో వాహనాలు, అనుమానిత వ్యక్తులపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుంచి సుమారు 2.9 కిలోల గంజాయి లభ్యమైంది.
పట్టుబడిన నిందితులను మీసాల శ్యామ్, కాశిబోయిన గౌతమ్, గుండా కార్తీక్ గా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జనగామ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

