కలం, వెబ్ డెస్క్: మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Arava Sridhar) వ్యవహారంపై జనసేన (Janasena) అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై నిజానిజాలు తేల్చేందుకు ఓ విచారణ కమిటీని వేసింది. కమిటీ వాస్తవాలు బయటపెట్టే వరకు ఎమ్మెల్యే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టి.శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టీసీ వరుణ్ సభ్యులుగా ఉన్నారు. అరవ శ్రీధర్ ఏడు రోజుల్లోగా ఈ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని పార్టీ సూచించింది. కమిటీ సదరు ఆరోపణలపై విచారణ చేసి నిజానిజాలను పార్టీకి నివేదిక అందిస్తుంది. ఆ నివేదికను పరిశీలించి పార్టీ అధిష్టానం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Arava Sridhar) తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఎమ్మెల్యే తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అరవ శ్రీధర్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ వీడియోలస్నీ డీప్ ఫేక్ అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: అదే అజిత్ దాదా స్పెషల్!
Follow Us On : WhatsApp

