కలం, వెబ్ డెస్క్: తిరుపతిలో నిర్వహించిన జనసేన (JanaSena) సమావేశంలో రసాభాస చోటు చేసుకున్నది. శుక్రవారం తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పార్టీ ఇన్చార్జ్ల వ్యవహారశైలిపై కార్యకర్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి సమక్షంలోనే పలువురు కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం సమావేశంలో హాట్టాపిక్గా మారింది.
కార్యకర్తల అభిప్రాయాలకు విలువ లేదు
పార్టీ కోసం కష్టపడుతున్న తమను ఇన్ఛార్జ్లు పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆరోపించారు. స్థానిక స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్న కార్యకర్తలతో సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది ఇన్చార్జ్లు కార్యకర్తలను హీనంగా చూస్తున్నారని, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్చార్జ్లను మార్చండి
ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన కార్యకర్తల్లో ఒక్కరూ సంతృప్తిగా లేరని, ప్రస్తుత ఇన్చార్జ్లను వెంటనే మార్చాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. సమావేశం మధ్యలోనే పలువురు కార్యకర్తలు లేచి తమ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. పార్టీ బలోపేతానికి అందరి సహకారం అవసరమని, కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మరి ఇప్పటికైనా వివాదం సద్దుమణుగుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.

