కలం, వెబ్ డెస్క్ : రాజకీయ నాయకులను విమర్శించారనే కారణంతో ఒక ఆర్టీసీ డ్రైవర్ (Jagtial RTC Driver) పై వేటు పడింది. జగిత్యాల ఆర్టీసీ డిపో పరిధిలో ప్రైవేట్ హైరింగ్ బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న బి. అశోక్ ను తక్షణమే విధుల నుండి తొలగించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. మే 25వ తేదీన జగిత్యాల ఆర్డీఓ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ సమయంలో జగిత్యాల నుండి ధర్మపురి రూట్ లో వెళ్తున్న బస్సు డ్రైవర్ అశోక్, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రతినిధులను, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ మాట్లాడారనే ఆరోపణలు వచ్చాయి. ముందు వడ్లు, మక్కలు కొనాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ధర్మపురి మండల ప్రెసిడెంట్ సి. లక్ష్మణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డ్రైవర్ ప్రవర్తనపై ఆయన జగిత్యాల డిపో మేనేజర్ కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణించిన ఆర్టీసీ యాజమాన్యం, సదరు డ్రైవర్ ను హైరింగ్ సేవల నుండి తక్షణమే ఉపసంహరించుకోవాలని బస్సు యజమాని చుక్కా వేణుగోపాల్ కు నోటీసు ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

