కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల నియోజకవర్గంలోని చల్గల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu)కు వినతి పత్రం అందజేశారు. శనివారం హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే, చాలా రోజులుగా స్థలం కేటాయింపు వాయిదా పడుతోందని తెలిపారు. ఈ విషయమై గతంలో నీటి పారుదల శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చామని, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా పూర్తిగా సహకరిస్తున్నారని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరితగతిన స్థలం కేటాయించాలని మంత్రి ఆదేశించినట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.

