కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ సంతోష్ రావు గూఢచారిగా పని చేస్తున్నారని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi)అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మొదటగా చెప్పిన దయ్యం ఆయనే (Santosh Rao) అని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. సంతోష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆమె స్పందించారు. ఉద్యమనేత కేసీఆర్ తో ఉద్యమకారులను కలవనీయకుండా చేసింది సంతోష్ రావు అని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో సగం ఇడ్లి తిన్నారా? పూర్తిగా ఇడ్లి తిన్నారా? అన్న సమాచారాన్ని కూడా సంతోష్ రావే గుంపు మేస్త్రీకి చేరవేసేదన్నారు.
రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారి సంతోష్ రావుకు శిక్ష విధిస్తాడని తాను నమ్మడం లేదన్నారు. సంతోష్ రావు ను సిట్ పిలవటం మంచిదేనని, కానీ ఆయనకు శిక్ష పడటంపై కవిత అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గుడికి కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావటం లేదన్నారు. నిజంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే కచ్చితంగా సంతోష్ రావుకు శిక్ష పడుతుందని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు తమ పని తాము చేయాలని కవిత విజ్ఞప్తి చేశారు.
ఎక్సైజ్ పోలీసులకు ఆయుధాలు ఇవ్వాలి :
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారన్నారు. ఎక్సైజ్ పోలీసులు అంటే గంజాయి స్మగ్లర్లకు భయం లేకుండా పోయిందన్నారు. ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు అందించడం ద్వారా స్మగ్లర్లకు భయం ఉంటుందని ఆమె చెప్పారు. గతంలో ఫారేస్టు, ఎక్సైజ్ అధికారులకు వెపన్స్ ఉండేవని.. తిరిగి మళ్లీ వారికి ఆయుధాలు అప్పగించాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.


