యువతి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది.. స్థానికుల దాడిలో హతం!

కలం, వెబ్ డెస్క్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల (Jadcherla) పట్టణంలోని నిమ్మబావి గడ్డ ప్రాంతంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన ఓ యువకుడు, ప్రియురాలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందనే కక్షతో ఆమెను కిరాతకంగా హతమార్చాడు. ఆపై స్థానికులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమ్మబావి గడ్డకు చెందిన వైష్ణవి అనే యువతిని తేజ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల వైష్ణవికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ జరగడాన్ని తట్టుకోలేకపోయిన తేజ, ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే యువతి ఇంటి వద్దే ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. వైష్ణవి గొంతు కోసి ఘాతుకానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సదరు యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఈ దారుణాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడు తేజను పట్టుకుని చేతులు కట్టేశారు. అనంతరం బండరాళ్లతో అతడిపై విరుచుకుపడ్డారు. స్థానికులు జరిపిన ఈ దాడిలో తేజకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిందితుడు కూడా మరణించాడు. ఒకే ఘటనలో ఇద్దరు యువతీయువకులు మృతి చెందడంతో జడ్చర్ల పట్టణంలో తీవ్ర కలకలం రేగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>