కలం, వెబ్ డెస్క్: ఇరాన్తో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం తమకు వర్తించబోదని ఇజ్రాయెల్ (Israel) స్పష్టం చేసింది. అమెరికా ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని, తమ ప్రజల భద్రతే ముఖ్యమని తేల్చి చెప్పింది. తద్వారా ఇకపైనా ఇరాన్పైనా దాడులు కొనసాగుతాయని పరోక్షంగా వెల్లడించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ జాతీయ భద్రత వ్యవహారాల మంత్రి బెన్ గ్విర్ పేర్కొన్నారు. ‘ట్రంప్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు. ఇజ్రాయెల్ దీనికి కట్టుబడి ఉండదు. మాది స్వతంత్ర, సౌర్వభౌమ దేశం. మా ప్రజల రక్షణే మాకు ముఖ్యం. వేలాది సంవత్సరాలుగా మా ప్రజలను చంపుతూ వస్తున్న వారి నుంచి కాపాడుకోవడమే ప్రధాన కర్తవ్యం. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రతీసారి మా దేశ భద్రతను పణంగా పెట్టాల్సి వస్తోంది. మా ప్రజలు రక్తం చిందించారు. 2006 లెబనాన్ ఒప్పందం తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. మేం అమెరికాను ప్రేమిస్తాం. ట్రంప్ పట్ల ఎప్పుడు ధన్యవాద భావనతోనే ఉంటాం. కానీ మా భద్రతను ప్రమాదంలో పడేయలేం’ అని పేర్కొన్నారు.
ఒప్పందంలో మేం భాగం కాదు..
ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇవ్వని ఈ ఒప్పందంలో మేం భాగంగా లేమని మంత్రి బెన్ గ్విర్ ప్రకటించారు. ‘హెజ్బొల్లా వంటి ఉగ్రవాదుల నుంచి మమ్మల్ని మేం రక్షించుకునే విషయంలో ఎలాంటి షరతులకు అంగీకరించలేం. లెబనాన్ నుంచి మా దేశంపైకి వచ్చే ప్రతీ డ్రోన్, క్షిపణికి ప్రతి దాడి కచ్చితంగా ఉంటుంది. 3 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇజ్రాయెల్ ప్రజలు దేనికీ భయపడరు. మేం చాలా బలవంతులం. శత్రువుల ముందు ఎట్టి పరిస్థితుల్లో తలవంచబోం. చరిత్రలో జరిగిన దారుణాలను మరోసారి జరగనివ్వబోం’ అని స్పష్టం చేశారు.

