కలం, వెబ్ డెస్క్: ఈ టెక్నాలజీ యుగంలో పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు వాట్సాప్ (WhatsApp) మన దినచర్యలో భాగమైపోయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహోద్యోగుల నుంచి మెస్సేజ్ లు, వీడియోలు, కాల్స్ తోపాటు కంపెనీల ఇంటర్వ్యూలకూ వాట్సాప్ వాడడం సర్వసాధారణం అయ్యింది. ఇటీవలే పేమెంట్లకూ వాట్సాప్ వినియోగిస్తున్నారు. ఇన్ని రకాల ఉపయోగాలున్న వాట్సాప్ త్వరలో కనుమరుగు కానుందా? ఈ మెసేజింగ్ యాప్ కు ప్రత్యామ్నాయం రానుందా? అంటే అవుననే అంటున్నాయి వ్యాపార వర్గాలు. కారణం..వాట్సాప్ కంటే మెరుగైన, ఆధునికమైన ప్రత్యామ్నాయం అందుబాటులోకి రానుండడమే. ఈ దిశగా గూగుల్ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం దీనికి బలం చేకూరుస్తోంది.
ఎయిర్టెల్ అంగీకరించడంతో..:
WhatsApp కి పోటీగా ప్రత్యామ్నాయ మెసేజింగ్ వేదికను తీసుకురావాలని కొన్నేళ్లుగా గూగుల్ ప్రయత్నిస్తోంది. తద్వారా ఈ విభాగంలో మెటా ఆధిపత్యానికి, మార్కెట్ కు చెక్ పెట్టడమే గూగుల్ ఉద్దేశం. వాస్తవానికి వాట్సాప్ కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వినియోగదారులు ఉన్నారు. చైనా, ఉత్తర కొరియా, సిరియా మినహా దాదాపు 180 దేశాల్లో వాట్సాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి. రష్యా, యూఏఈ, ఖతార్, ఈజిప్ట్, ఒమన్ దేశాల్లో వాయిస్/వీడియో కాల్స్ మీద ఆంక్షలతో వాట్సాప్ పనిచేస్తోంది. ఆయా దేశాలు సెక్యూరిటీని, స్థానిక టెలికాం సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఈ పరిమితులు విధించినట్లు చెబుతున్నాయి. ఇక మన దేశంలో అయితే దాదాపు 85 కోట్ల మంది వాట్సాప్(WhatsApp) వాడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందువల్లే వాట్సాప్ కు భారత్ అతి పెద్ద మార్కెట్ గా ఉంది. దీనిపై గూగుల్ కన్నుపడింది.
ఎలాగైనా సరే WhatsApp కు తద్వారా మెటా ఆధిపత్యానికి చెక్ పెట్టాలని గూగుల్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఆర్సీఎస్ మెసేజ్ ప్లాట్ఫామ్ ను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా మన దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీలయిన ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలను సంప్రదించింది. కొత్త మెసేజింగ్ ప్లాట్ ఫామ్ తయారీలో ఈ మూడింటినీ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించి, ప్రయత్నాలు ప్రారంభించింది. గూగుల్ ప్రతిపాదనకు జియో, వొడాఫోన్ ఐడియా ఒప్పుకున్నాయి. కానీ, ఎయిర్టెల్ మాత్రం అంగీకరించలేదు. కారణం.. ఆర్సీఎస్లో స్పామ్ నియంత్రణకు సరైన వ్యవస్థ లేకపోవడమే. అందువల్ల గూగుల్ ప్రతిపాదనను ఏడాదికి పైగా పెండింగ్ లో పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల భారత టెలికాం మంత్రిత్వ శాఖ.. టెలికాం కంపెనీలన్నీ స్పామ్కాల్స్, మెసేజ్లపై విధిగా తమ వినియోగదారులను హెచ్చరించాలనే నిబంధన పెట్టింది. మరోవైపు స్పామ్ నియంత్రణకు ఏఐతో ఆధునిక వ్యవస్థను గూగుల్ సిద్ధంచేసింది. ఈ పరిణామాల వల్ల గూగుల్ ప్రతిపాదనకు ఎయిర్టెల్ పచ్చజెండా ఊపింది. ఫలితంగా త్వరలోనే ఆర్సీఎస్ మెసేజింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
ఆర్సీఎస్ ఫీచర్లు, ప్రయోజనాలు..:
రిచ్ కమ్యూనికేషన్ సర్వీస్కు సంక్షిప్త రూపమే ఆర్సీఎస్. ప్రస్తుతం మనకు తెలిసిన ఎస్ఎంఎస్, ఎంఎంఎస్లకు ఆధునిక వెర్షన్ ఇది. మొబైల్ డేటా, వైఫై ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో రిచ్ ఫీచర్లు ఉంటాయి. హై రెజల్యూషన్ (అధిక నాణ్యత) కలిగిన ఫొటోలు, వీడియోలు, జిఫ్లు పంపొచ్చు. మన మెసేజ్కు ఎవరైనా రిప్లయ్ ఇచ్చేటప్పుడు టైప్ చేయడం చూపిస్తుంది. అలాగే రీడ్ రిసీప్ట్లు చూడొచ్చు. గ్రూప్ చాట్ లు చేయొచ్చు. మెసేజ్లో అక్షరాల పరిమితి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ మెసేజ్లకు భిన్నంగా, వాట్సాప్ ఫీచర్ల తో పాటు మరికొన్ని అదనంగా ఆర్సీఎస్ లో ఉంటాయి. ఇందులో అత్యంత ముఖ్యమైన ఫీచర్.. సాధారణ ఎస్ఎంఎస్ / ఎంఎంఎస్ మాదిరి సెల్యులార్ నెట్వర్క్ పై కాకుండా, డేటా కనెక్షన్పై పనిచేయడం. మన ఫోన్ లోని సాధారణ మెసేజింగ్ యాప్కు మరింత ఆధునికంగా, రిచ్ ఫీచర్లతో ఆర్సీఎస్ ఉంటుంది. ఎస్ఎంఎస్ కు తర్వాతి తరమే ఈ ఆర్సీఎస్.
గూగుల్కే అధిక వాటా:
ఆర్సీఎస్ ప్లాట్ ఫామ్లో ఒక్కో మెసేజ్ కు 0.11 పైసల చొప్పున వసూలు చేస్తారు. ఆదాయం 80:20 నిష్పత్తిలో పంచుకుంటారు. అంటే గూగుల్కు 80శాతం వాటా అందుతుంది. ఆర్సీఎస్కు దేశంలోని మూడు ప్రధాన టెలికం సర్వీసులు అంగీకరించడంతో ఇక త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రావడమే మిగిలుంది.
Read Also: ‘వందేమాతరం’ ను కాంగ్రెస్ ముక్కలు చేసింది : మోడీ
Follow Us On: Instagram


