కలం, వెబ్ డెస్క్ : హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని, ఇరాన్ (Iran) కు డబ్బులు చెల్లించి బయటకు వచ్చిన నౌకలను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హర్మూజ్ జలసంధిలో ఏ మాత్రం తప్పుడు అడుగులు వేసినా తమ శత్రువులు ప్రాణాంతక సుడిగుండాలలో చిక్కుకుపోతారని ఇరాన్ (Iran) సైనిక విభాగం IRGC (ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కార్ప్స్) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ డ్రోన్లు జలసంధిని ఎల్లప్పుడు పర్యవేక్షిస్తున్నాయని, ఆ ప్రాంతంలోని అన్ని కదలికలు ఇరాన్ సాయుధ దళాల నియంత్రణలో ఉన్నాయని నేవీ కమాండ్ వెల్లడించింది. కాగా, డొనాల్డ్ ట్రంప్ జలసంధిని దిగ్భందించండి అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ పెట్టిన కాసేపటికే ఇరాన్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
అయితే, దాదాపు నెలన్నర రోజులుగా కొనసాగుతున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఇస్లామాబాద్ లో జరిగిన ఇరాన్ – అమెరికా చర్చల అనంతరం సద్దుమణుగుతాయని అందరూ భావించారు. కానీ, రెండు రోజుల పాటు పాక్ లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ తో చర్చల్లో అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ.. అణు శక్తి, ఇరాన్ కు ఇతర దేశాల్లో ఉన్న అకౌంట్ల ఫ్రీజింగ్ పై అంగీకారం కుదరలేదని తెలిసింది. ఈ క్రమంలోనే ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. తాము అనుకుంటే ఇరాన్ కు ఒకే రోజులో నాశనం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

