కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) వరుసగా మూడో ఓటమిని చవిచూడటంతో ఆ జట్టు వ్యూహాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 19, ఆదివారం నాడు పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో రిషబ్ పంత్ సేన విఫలమైంది. ఈ నేపథ్యంలో లక్నో తీసుకున్న పలు నిర్ణయాలను మాజీ క్రికెటర్లు మోహిత్ శర్మ, మనోజ్ తివారీ తప్పుబట్టారు. ఈ మ్యాచ్లో ఆయుష్ బదోనీని ఓపెనర్గా పంపడంపై మోహిత్ శర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 255 పరుగుల భారీ లక్ష్యం ముందున్నప్పుడు, అద్భుతమైన ఫామ్లో ఉన్న ఐడెన్ మార్క్రమ్ను పక్కన పెట్టి బదోనీని పంపడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
పవర్ప్లేలో 80 నుంచి 90 పరుగులు రాబట్టే అవకాశం ఉన్నప్పటికీ, లక్నో యాజమాన్యం పదేపదే ఓపెనర్లను మార్చడం వల్ల జట్టు నిలకడ కోల్పోతోందని ఆయన పేర్కొన్నారు. బదోనీ 35 పరుగులు చేసినా, అది జట్టు అవసరానికి సరిపోలేదని వివరించారు. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.. లక్నో మేనేజ్మెంట్పై మరింత ఘాటుగా స్పందించారు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన మార్క్రమ్ను ఓపెనర్గా నమ్మనప్పుడు, అసలు ఆయన్ని తుది జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఆటగాళ్లను వారి సహజ స్థానాల్లో ఆడించనప్పుడు వారిని పక్కన పెట్టి అర్షిన్ కులకర్ణి వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం మేలని సూచించారు.

