కలం, నిర్మల్: జల్సాలకు అలవాటు పడి ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను సోన్ పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ (Nirmal) డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన చిట్యాల రాజు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. గత నెల జూన్ 25న ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు. దానిపై గంజాల్ గ్రామానికి చేరుకొని ఓ కిరాణా దుకాణం తాళాలు పగులగొట్టి నగదు దొంగిలించాడు.
ఆ తర్వాత ముత్యాల పోచమ్మ ఆలయంలో హుండీని ధ్వంసం చేసి నగదు దోచుకున్నాడు. మళ్ళీ రెండు రోజుల అనంతరం నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ శివాలయంలో చోరీకి పాల్పడ్డాడు. గ్రామస్తులు ఆలయం వద్దకు రావడంతో నగదును అక్కడే వదిలి పరారయ్యాడు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాహన తనిఖీల్లో నిందితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. రెండు ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు రుజువు కావడంతో 6 వేల నగదు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై గోపి, పోలీసు సిబ్బందిని ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.

