కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. నగరంలోని గోదాములు, అనుమానాస్పద ప్రాంతాలు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల (Drugs) అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ తనిఖీల్లో TGSP (తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్) సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. సరిహద్దు ప్రాంతాలు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల వివరాలను సేకరించి, వారి నేపథ్యాన్ని ఆరా తీస్తున్నారు.
గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల్లో పార్సిళ్లను, గోదాముల్లో నిల్వ ఉంచిన సరుకులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. సమాజానికి చేటు చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని, అక్రమ కార్యకలాపాలను ఏమాత్రం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

