కలం, వెబ్డెస్క్: అంతరించిపోయిన జీవులకు తిరిగి ప్రాణం పోయడం సాధ్యం అవునో కాదో కానీ ఎప్పుడో వేల ఏళ్ల కిందటి ఓ చిత్రానికి మాత్రం భారత నేవీ అధికారులు ప్రాణం పోశారు. ఆశ్చర్యంగా ఉందా? భారత నేవీ రూపొందించిన ఐఎన్ఎస్వీ కౌండిన్య (INSV Kaundinya) నౌక దీనికి ఉదాహరణ. మహారాష్ట్రలోని అజంతా గుహల్లో చిత్రించిన 5వ శతాబ్దం నాటి ఓ నౌకను చూసి దీన్ని తయారుచేశారు. పూర్తిగా పాతకాలం పద్ధతిలో.. మేకులు, ఇనుప వస్తువులు వాడకుండా, కొబ్బరి పీచు, చెక్కలు, తెరచాపలు, సహజసిద్ధమైన జిగురుతో తయారుచేసిన ఈ నౌకే ఒక అద్భుతం అనుకుంటే ఇప్పుడిది మరో ఘనత సాధించింది.

గత నెల గుజరాత్లోని పోర్బందర్ నుంచి అరేబియా సముద్రం మీదుగా ప్రయాణం సాగించిన ఐఎన్ఎస్వీ కౌండిన్య.. అరేబియా ద్వీపకల్పంలోని దేశమైన ఒమన్లోని మస్కట్లో ఉన్న పోర్ట్ సుల్తాన్ ఖబూస్ ఓడరేవుకు చేరింది. ఈక్రమంలో ఇంజిన్లు లేకుండా కేవలం గాలి ఆధారంగా 1,400 కి.మీ దూరం ప్రయాణించింది. 18 రోజుల్లో ఇది తన గమ్యాన్ని చేరుకుంటుందని జర్నీ స్టార్ట్ చేసినప్పుడు భావించినప్పటికీ ఒకరోజు ముందుగానే ఒడ్డుకు చేరింది. ఈ నౌకకు కమాండర్ వికాస్ షెరాన్ సారథ్యం వహించగా, మరో 16 మంది సిబ్బంది ఉన్నారు. నౌక తీరాన్ని చేరగానే వీళ్లంతా సంతోషంతో సంబరాలు జరుపుకొన్నారు. కాగా, కేరళకు చెందిన బాబు శంకరన్ నేతృత్వంలోని కళాకారులు తయారుచేసిన ఈ నౌక నిరుడు ఫిబ్రవరిలో భారత నేవీలోకి చేరింది.

Read Also: శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పరవశించిన అయ్యప్ప భక్తులు
Follow Us On: Sharechat


