కలం, వెబ్డెస్క్: అమెరికా చెరలో భారత నేవీ ఆఫీసర్ (Indian Navy Officer) ఒకరు చిక్కారు. గత వారం అట్లాంటిక్ సముద్రంలో వెనెజువెలా నుంచి రష్యాకు వెళుతున్న మారినెరా నౌకను అమెరికా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, ముగ్గురు భారత్కు చెందినవాళ్లు. వీళ్లలో ఒకరు కేరళ, మరొకరు గోవా, ఇంకొకరు హిమాచల్ ప్రదేశ్కు చెందిన వాళ్లని రష్యా వెల్లడించింది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో విషయం బయటపడింది. అమెరికా బందీల్లో ఒకరైన హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాకు చెందిన నేవీ ఆఫీసర్ రక్షిత్ చౌహాన్ (Rakshit Chauhan) కు వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో రక్షిత్ బందీ అయ్యాడని తెలిసి అతని కుటుంబం తల్లడిల్లిపోతోంది.
‘రక్షిత్.. రష్యా మర్చంట్ నేవీలో నిరుడు ఆగస్ట్ 11న నేవీ ఆఫీసర్గా చేరాడు. మొదటి అసైన్మెంట్గా వెనెజువెలాకు పంచినట్లు ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాడు. చివరి సారి జనవరి 7న రక్షిత్తో మాట్లాడాం.. అంతే. ఆ తర్వాత మా కుమారుడు అమెరికా చేతిలో బందీ అయినట్లు తెలిసింది. ఫిబ్రవరి 19న రక్షిత్కు (Rakshit Chauhan) పెళ్లి చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు ఇలా అమెరికా చెరలో ఉన్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని మా వాడిని విడిపించాలి’ అని రక్షత్ అమ్మ రీటా దేవి, తండ్రి రంజిత్ సింగ్ చౌహాన్ వేడుకుంటున్నారు. కాగా, ఇప్పటివరకు తమ కుమారుడి గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం ప్రభుత్వం నుంచి అందలేదని చెబుతున్నారు. పాలంపూర్ ఎమ్మెల్యే ఆశిష్ భుతాలియా దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని అంటున్నారు.
Read Also: కట్టుబాట్లను ధిక్కరించి.. ట్రాన్స్జెండర్ను పెళ్లి చేసుకున్న యువకుడు
Follow Us On : WhatsApp


