కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో కాల్పుల (West Asia Conflict) విరమణపై భారత ప్రభుత్వం (Indian Govt) స్పందించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందం ఆ ప్రాంతంలో శాశ్వత శాంతికి నాంది పలకాలని భారత విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. వివాదాలను పరిష్కరించుకునేందుకు శాంతి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరా, వాణిజ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ప్రస్తుతం కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హార్మూజ్ జలసంధి గుండా అంతర్జాతీయ వాణిజ్యం, నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఉంటుందని ఆకాంక్షిస్తున్నట్లు భారత్ వెల్లడించింది.
Read Also: తెలంగాణ టూరిజం.. సమ్మర్ లో చుట్టేద్దాం
Follow Us On: Facebook

