కలం, వెబ్ డెస్క్ : ఖతార్ రాజధాని దోహా (Doha Qatar)లో నివసిస్తున్న భారతీయ పౌరులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలకమైన ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ కోరింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలను, వివిధ రకాల ఊహాగానాలను అస్సలు నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఖతార్ ప్రభుత్వ అధికారిక ఛానళ్లు, ప్రభుత్వ సంస్థలు విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.
భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎంబసీ పలు జాగ్రత్తలను వెల్లడించింది. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని ఎంబసీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, స్థానిక చట్టాలను, నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరింది. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
భారతీయ పౌరుల సంక్షేమం కోసం ఎంబసీ నిరంతరం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఏదైనా అత్యవసర సహాయం కోసం ఎంబసీ హెల్ప్లైన్ నంబర్ +974-55647502 కు కాల్ చేయవచ్చని లేదా cons.doha@mea.gov.in కు ఈమెయిల్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు. తాజా అప్డేట్ల కోసం ఎంబసీ అధికారిక ఫేస్బుక్ లేదా ఎక్స్ ఖాతాలను అనుసరించాలని కోరారు.

