కలం, వెబ్ డెస్క్: యూఎస్, రష్యా, జర్మనీ లాంటి దేశాల్లో భారతీయులు అధికంగా ఉంటున్నారు. దీంతో ఆయా దేశాల్లో ఇండియన్ కల్చర్కు (Indian Culture) రోజురోజుకూ ప్రాధాన్యం పెరిగిపోతోంది. భారతీయ సంస్కృతీపై ఆసక్తితో ఆచార వ్యవహారాలను సైతం అడప్ట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీలో (Germany) ప్రవాస భారతీయుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం, స్థానిక చట్టాలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తున్నాయి. దీనికి నిదర్శనంగా ఇటీవల జర్మనీ వీధుల్లో అమ్మన్ కోవిల్ తిరువిళ (అమ్మన్ కోవ పండగ) వేడుకలు వైభవంగా జరిగాయి.
తమిళ సంస్కృతిలో గ్రామ దేవతగా కొలిచే అమ్మవారికి నిర్వహించే ఈ ఉత్సవానికి జర్మన్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు కల్పించారు. అలాగే ఊరేగింపు సాఫీగా సాగేలా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలోనూ చురుగ్గా పాల్గొన్నారు. పరాయి దేశంలో ఉన్నప్పటికీ తమ ఆచారాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం పట్ల అక్కడి తమిళ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భారతీయ పండుగలకు లభిస్తున్న ఈ గౌరవం రెండు దేశాల మధ్య పెరుగుతున్న సాంస్కృతిక సయోధ్యకు ఆదర్శంగా నిలుస్తోంది.

